గురువు వాస్తవాన్ని, కర్తవ్యాన్ని సూటిగా స్పష్టంగా తెలియచెబుతాడు.

అనావృష్టికి గురియైన ప్రజల సహాయార్థం వారికి పని కల్పిస్తూ ఛత్రపతి శివాజీ ఒక వంతెన నిర్మాణం గావిస్తుంటాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలనందర్ని చూచి శివాజీ తన దయవల్లనే ఇన్ని వేలమంది ప్రజలు కూలి చేసుకుని కడుపు నింపుకొంటున్నారని, తానా పనిని వారికి కల్పించి ఉండకపోతే ఆకలితో మాడి మరణించి ఉండేవారని భావిస్తూ గర్వంతో పొంగిపోతాడు. ఆ దారివెంట వెళుతూ సమర్థగురు రామదాసు ఆస్థితిలో శివాజీని చూచి పరిస్థితిని అవగతం చేసుకుని మౌనంగా ఊరుకొంటాడు.
తరువాత రోజు శివాజీని వెంటబెట్టుకుని ఒక మార్గం గుండా పయనిస్తూ దారిలో కనిపించిన ఒక పెద్దరాయిని శివాజీకి చూపి దానిని కదలించఖలవేమో ప్రయత్నించుమంటాడు. అతి సునాయాసంగా వీరశివాజీ రాయిని ఎత్తి పడవేశాడు. రాయిక్రింద ఒక గొయ్యి, గోతిలో నీళ్లు, నీటిలో కొన్ని కప్పలు గెంతుతూ కన్పించాయి. సమర్థగురు రామదాసు శివాజీ వంకచూచి ఈ రాయి క్రింద ఈ కప్పలకోసం, ఇంతటి సౌకర్యం, రక్షణ బహుశా నీవే కల్పించివుంటావు.
నీ ఔదార్యం వల్లనే ఇవి మాడి మరణించకుండా ఉల్లాసంతో జీవితాలు గడుపుతూ ఉండి ఉంటాయి. అవునా! అని తీక్షణంగా ప్రశ్నించాడు. శివాజీ సిగ్గుతో తల వంచుకుంటాడు. ఇలా ప్రతి విషయంలోను సమర్థగురు రామదాసు శివాజీకి వాస్తవాన్ని, కర్తవ్యాన్ని సూటిగా స్పష్టంగా తెలియచెప్పేవాడు. కేవలం ఆయన అనుగ్రహం మార్గదర్శనం లోనే శివాజీ అడుగడుగునా ఆపదలను అధిగమిస్తూ శ్రేయోమార్గంలో పయనించి గొప్ప వాడవుతాడు.