మాటలకూ భావాలకూ, అలాగే మాటలకూ చేతలకూ ఎలాంటి పోలిక లేదు.

ఒక జిజ్ఞాసువు జ్ఞానితో దేవా! మానవ జీవితాన్ని అలంకరించగల శృంగార దేవతలెవరు? అని ప్రశ్నిస్తాడు. జ్ఞాని వెంటనే “హృదయం, నాలుక” అని జవాబిస్తాడు. మరి జీవితాన్ని మలినం చేయగల అసురులెవ్వరని ప్రశ్నిస్తాడు. జ్ఞాని ఈసారి కూడ “హృదయం, నాలుక” అని బదులు పల్కుతాడు. అది ఎలా సాధ్యమని జాజ్ఞాసువు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.
“నాయనా! మధురమైన సంభాషణను నాలుక, సంస్కార వంతమైన ఆచరణను హృదయం సంపదల రూపంలో మానవునకు ప్రసాదించాయి. ఈ రెండూ లభించిన వారి జీవితం సార్థకమైనట్లే. అలాకాక నాలుక ద్వారా కటువు మాటలు, హృదయం ద్వారా కుచ్చితమైన ఆచరణలు ఉద్భవించినపుడు ఆ రెండే వ్యక్తిని రాక్షసుల కంటె ఎక్కువగా హింసించి, కబళించి వేస్తాయి” అని జ్ఞాని జిజ్ఞాసువుకు తెలితచేసాడు.
వన విహారానికి వెళ్లిన రాజు చెట్టు క్రింద విశ్రమిస్తాడు. ఎదురుగా ఒక అంధుడు నూతి నుండి నీటిని తోడిపోసి యాత్రికుల దాహం తీరుస్తూ ఉంటాడు. రాజు సిపాయిని పంపి తనకు కూడా నీటిని తీసుకుని రమ్మంటాడు. కానీ అంధుడు నీటిని ఇవ్వటానికి నిరాకరిస్తాడు. తర్వాత ప్రధాన సేనాపతి వెళ్లి, సోదరా గ్లాసుడు నీళ్లియ్యి అని అడుగుతాడు. అంధుడు నిరాకరిస్తాడు. ఇద్దరూ వెళ్లి రాజుకు ఫిర్యాదు చేస్తారు.
రాజు స్వయంగా వెళ్లి అంధునికి నమస్కరించి, అయ్యా! దాహంతో గొంతు ఎండిపోతుంది. నీళ్లిచ్చి నా దాహాన్ని కూడా తీర్చుమని అడుగుతాడు. అంధుడు రాజుకి మర్యాద చేసి త్వరత్వరగా నీళ్లు తోడి దాహాన్ని తీరుస్తాడు. రాజు అంధునివంక పరిశీలనగా చూస్తూ అయ్యా! అంధుడివొ ఉండి నీవు మా అందరను ఎలా గుర్తించగలిగావు? అని ప్రశ్నిస్తాడు. వృద్ధుడు నవ్వి రాజా! కన్నులు లేనంత మాత్రాన వాక్కు ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించలేరంటవా! వ్యక్తాత్వాన్ని తెలియ చెప్పేది వాక్కు అని బదులు పల్కుతాడు.
అశుభం పల్కేవారికి చివరకు తిరస్కారం, దండన అనుభవించవలసి వస్తుంది. ఒక ముసలమ్మ ఏకైక సంతానానికి వివాహాం జరుగుతోంది. మధ్యలో ఒక సాధువు వచ్చి ముసలమ్మను భోజనం, ఆశ్రయం కోరుతాడు. ఆమె అతను కోరినవన్నీ ఇచ్చి, నాయనా! శుభకార్యం జరిగే ఇంట్లో ఒక్క అశుభవచనం కూడా పలుకరాదని షరతు పెడుతుంది. సాధువు సరేనంటాడు.
మర్నాడు ముసలమ్మ కనిపించగానే అశుభవచనాలు కలవాటు పడిన సాధువు బాధతో అమ్మా! నీ ఏకైక సంతానం ఏదైనా రోగం వచ్చి చనిపోయాడనుకో, నీ జీవితం ఎలా గడుస్తుంది? వెనుకాల ఏమైనా ఆస్తిపాస్తులున్నాయా? అని కుశల సమాచారం అశుభాన్ని పల్కుకుతాడు. ఆ మాటలకు ముసలమ్మ మండిపడి నా జీవితంలో ఆ విపత్తు వ్రాసిపెట్టి ఉంటే నేనే ఎలాగో అనుభవిస్తానుగానీ తక్షణమే ముందు నీవు బయటకు నడువుమని తినబోయే అన్నాన్ని తిననీయక తరిమివేస్తుంది.
జిహ్వను ఉపవాసాల ద్వారా, అభ్యాసం ద్వారా నియంత్రణలో ఉంచవచ్చు. మౌనం మనస్సుకు మంచిది. ఉపవాస ప్రభావం శరీరం మీద, మౌనప్రభావం మనస్సు మీద పడితే శరీర బలం, మనోబలం వృద్ధి చెందుతాయి.
జిహ్వ తరువాత జననేంద్రియాలలో శ్రేష్ఠమైనవిగా పేర్కొనబడ్డాయి. మనస్సుకు వీటితో సరాసరి సంబంధం ఉంది. వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే మనస్సు మలినమై బలహీన మవుతుంది. బ్రహ్మచర్యానికి జీవితంలో ప్రాముఖ్యం ఇవ్వబడినది. ఎందుకంటే శరీరగత జీవశక్తిని, మానసిక ప్రతిభను రెండింటినీ కాపాడగల శక్తి బ్రహ్మచర్యానికి ఉంది.