Knowledge Becomes Meaningful only through Correct Understanding.

సరియైన అవగాహన వల్లనే జ్ఞానం సార్థకమవుతుంది.

ఒక వ్యక్తి మరోవ్యక్తితో, ఇంచుమించు 20 అడుగుల నేలను త్రవ్వితే చాలు నీరు పడుతుందని అంటాడు. వెంటనే రెండవ వ్యక్తి నుయ్యి తవ్వటం లో నిమగ్నడవుతాడు. 20 కాదుకదా 25 అడుగుల నేల త్రవ్వినా నీరు పడదు. మొదటి వ్యక్తి వద్దకు వచ్చి విషయాన్ని వివరిస్తాడు.

మొదటి వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా నేల 20 అడుగులు నిలువుగా త్రవ్వడానికి బదులు వెడల్పు గా త్రవ్వబడి ఉంది. అది చూచి మొదటి వ్యక్తి చింతిస్తూ, సోదరా! పని ప్రారింభించేముందు విధి విధానాలు విశదంగా తెలుసుకొని ఉండి ఉన్నట్లయితే నీ శ్రమ వృధా అయ్యేది కాదు. అని తెలియబరుస్తాడు.

సరియైన అవగాహన వల్లనే జ్ఞానం సార్థక మవుతుంది. దూరదృష్టితో ఆలోచించి ప్రణాళిక వేసుకుని తరువాత పనిని ఆచరణలో పెట్టాలి. దైవదత్తమైన కాలాన్ని ఒక్క క్షణమైనా వ్యర్థం చేయరాదు. ఈ దైవీసంపద యొక్క దుర్వినియోగం దైవానుగ్రహానికికాక దైవాగ్రహానికి కారణమవుతుంది.

ఆచరణకు మూలస్వరూపం ఆలోచన. కాలం వలనే ఆలోచనలను కూడా నిరంతరం సత్ర్పయోజనాలలో నిమగ్నం చేయటం వల్ల లౌకిక ఆధ్యాత్మిక జగత్తులు రెండు లాభాన్వితమవుతాయి. బాహ్యజగత్తులో కర్మ రూపంగా కనుపించేదంతా ఆలోచనల యొక్క పరిణామమే. ఎవరు ఏ విధంగా ఆలోచించి ఆచరిస్తూ ఉంటారో ఆ విధంగానే ఫలితాలను పొందుతూ ఉంటారు.

ఆలోచనల యొక్క ప్రవాహాన్ని రచనాత్మక దిశాధారల వెంట ప్రవహింప చేయటానకి చేసే కఠోర పురుషార్థమే ఆలోచనా నియమం యొక్క అసలు స్వరూపం. దీనినే వాస్తవంలో “మనోనిగ్రహం” అంటారు. మూర్ఖ పశువుల వలనే మనస్సు యొక్క నాడులలో గెంతులు వేసే పనికిరాని ఆలోచనలను ఏకగ్రత ద్వారా గానీ ఉన్నత స్థాయికి చెందిన ఉద్దేశ్యాలలో తన్మయత్నం పొందటం ద్వారా గానీ సరియైన మార్గంలో పెట్టి, ఈ విధంగా సమీక్షించిన తరువాత ఆలోచనా నియమాన్ని రెండు భాగాలుగా పేర్కొనటం జరిగింది.

  1. చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనలను సమీకరించి ఒకే దిశలో పెట్టటం.
  2. ఆలోచనలను నికృష్ట దిశనుండి ఉత్కృష్ట దిశగా మళ్ళించటం.

ఆలోచనల అసంతులనమే ఇంద్రియ సమయ, ధన, వాక్ సంయమనాల అసంతులనానికి అవవ్యయానికి మూలకారణంగా పేర్కొనబడింది.

లక్ష్యం పట్లగల ఏకాగ్రతే సాధకుని విశిష్టత, ద్రోణాచార్యుడు దుర్యోధనునితో ఎదురుగా ఏమి కనబడుతుందని ప్రశ్నించినపుడు ఆకాశం, వృక్షాలు, పక్షులు, ఆకులు అంటూ చాలా చెప్తాడు. నీ దృష్టి సరిగ్గా లేదు కూర్చోమంటాడు. ఈ విధంగా శిష్యులందరినీ పరీక్షిస్తాడు. కేవలం అర్జునుడు ఒక్కడే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పక్షి కన్ను తప్పించి మరేది కనిపించటం లేదనీ తెలియజేస్తాడు. ఈ విధంగా గురువు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు. ద్రోణుడు ఆనందంతో “ఎవరికైతో లక్ష్యం తప్ప వేరేది కనిపించదో వారి సాధన మాత్రమే ఫలిస్తుందని శిష్యులందరకు తెలియజేస్తాడు. అర్జునుని అభినందిస్తాడు.

విశిష్ట యోగ్యతలు పరమాత్మ ద్వారా ప్రసాదించబడతాయి. అందువల్లనే అనేక మందిలో ఒక్కొక్కరు మాత్రమే జ్ఞానులుగా, విద్వాంసులుగా, కళాకారులుగా పండితులుగా ప్రవీణులవుతున్నారు. నిజానికి భగవంతుడి యొక్క కృప అందరిమీద ఒకే లాగా ఉన్నా, వాళ్ళ వాళ్ళ ఆలోచనలను బట్టి ఎటువంటి వాటికి ఉపయోగిస్తారో దాని బట్టి వారే పొందుతారు.

పతంజలి మహర్షి ఆలోచనల యొక్క శక్తిని ఏకాగ్రతను అర్థంచేసుకుని, ఆచరణలో పెడుతూ, “యోగదర్శనం” అనే పేరుతో ఒక మహా గ్రంథాన్ని మానవజాతికి అందించేడు.

ప్రఖ్యాత ఆర్ష వేదాంతి జైమిని “మీమాంస” ను సూత్రరూపంలో క్రమబద్ధం చేసేటప్పుడు భార్యను పిలిచి, తాను తలుపు తెరువుమని చెప్పేవరకూ ఎంతకాలమైనా సరే తలుపు తెరవద్దని ఆజ్ఞాపిస్తాడు. ఆహార విహారాలు లేకుండా ఆయన ఆ గదిలో ఏడు రోజులు ఉండి ఏకాగ్రతతో ఆ పనిని పూర్తిచేస్తాడు. బయటకు వచ్చేసరికి ఆయన ముఖంమీద దివ్యతేజస్సు తాండవించింది. సాఫల్యం యొక్క వెలుగులు తొంగిచూచేయి. “మీమాంసాదర్శనము” అనే ఈ గ్రంధం ఆథ్యాత్మమూల సిద్ధాంతాలకు ఆధారభూతమైనది.

ఆలోచనలు అనేవి ఎవరికి వారే చేసుకోగల గొప్ప చికిత్స. శుభాకాంక్ష, సత్పరామర్శ మొదలైన ఆలోచనల బీజారోపణ ఈ ప్రయోజనాన్నే సిద్ధింపచేస్తుంది. అరవిందుడు, రమణమహర్షి మొదలైనవారం మౌనసాధనచేసి వారి ఆలోచనా శక్తిని సూక్ష్మ స్థాయిలో క్రియారూపంలో పెట్టారు. ఈ విధంగా వాతావరణంలో ఏర్పడిన విపత్తులు తొలగించ బడ్డాయి. సర్వత్రా విప్లవకెరటాలు ఉప్పొంగాయి.

అన్ని రకాల విప్లవాలు, సత్యాగ్రహాలు ఆలోచనల స్థాయినుండే ఆరంబమైనాయి. సామ్యవాదం, ప్రజాతంత్రం ఇవన్నీ ఆలోచనల నియంత్రణ యొక్క సామర్థ్యం ద్వారా లభించినవే. ఆలోచనాంధకారం వ్యాపిస్తే ప్రచండమైన తుఫాను ఏర్పడి కబళించివేస్తుంది. బుద్ధుడు, గాంధీ కాలంలో కూడా వ్యాపించిన అంధకారం వ్యక్తి వ్యక్తిని కుదిపి పరివర్తన తీసుకొచ్చింది.

అస్తవ్యస్తమైన ఆలోచనలు వ్యక్తిలో అలజడి సృష్టించి అస్థరునిగా చేస్తాయి. ఇలాంటి వారు దూరదృష్టితో ఏ నిర్ణయాలు తీసుకోలేరు. దేవశర్మ ఇంటిలో ఒకేరోజు ఇల్లాలికి పుత్రుడు, ముంగిసకు ముంగిస పిల్ల జన్మిస్తారు. ఇల్లాలు ఇద్దర్నీ చాలా ప్రేమతో పెంచేది. పిల్లవాడు నిద్రిస్తుండగా ఒకరోజు ఇల్లాలు నీటికై చెరువుకు వెళ్లింది. ముంగిస పిల్లవాని దగ్గరే ఉంది. ఇంతలో పిల్లవాని వద్దకు ఒక పాము వచ్చి కరవటానికి ప్రయత్నిస్తుంది. ముంగిస తటాలున పాముపై దూకి దానిని చంపి ముక్కలు చేస్తుంది.

ముంగిస ఆతృతగా యజమానురాలి కోసం బయలుదేరింది. మార్గమధ్యంలో ముంగిసను, దాని నోటిలో రక్తాన్ని చూచి ఇల్లాలు ముంగిస బాలుని చంపి ఉంటుందని భావించి నీళ్లబిందెతో దానిని కొట్టి చంపింది. తరువాత ఇంటికి వెళ్లి చూడగా వాస్తవ పరిస్థితి ఏమిటో ఇల్లాలికి అవగతమైనది. పశ్చాత్తాపంతో దుఃఖిస్తుంది. కానీ విశ్వాసపాత్రురాలు, నిర్దోషి అయిన ముంగిస బ్రతికిరాదు. కాబట్టి అస్తవ్యస్తమైన ఆలోచనలతో ఏ పనీ చేయరాదు.

Leave a Comment