సోమరితనం అనేది ఏకైక సంతానం కాదు. దానికి సోదరులు సోదరీమణులు అనేక మంది ఉన్నారు.
పుణ్యఫలంగా నహుషుడికి ఇంద్ర సింహాసనం లభించింది. స్వర్గ పట్టణాన్ని పరిపాలించసాగేడు. ఐశ్వర్యం, శక్తి, పదవి ఇవన్నీ లభించేసరికి నహుషుడు వీటి ప్రభావానికి గురియై ఇంద్రుడు ఇల్లాల్ని మోహిస్తాడు. తన అంతఃపురానికి ఆమెను తీసుకుని రావాలని ఆలోచనలు చేయసాగేడు. ఈ సంగతి తెలిసి శచీదేవి దుఃఖిస్తుంది. రాజాజ్ఞకు విరుద్ధంగా ఏమి చేయాలో అర్థంకాక ఒక పన్నాగం పన్ని నహుషుడు మహర్షులచే మోయబడే పల్లకీలో ఎక్కివస్తే అతనికి లొంగిపోతానని సందేశం పంపిస్తుంది.
ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి కామాతురుడైన నహుషుడు తాను ఎక్కిన పల్లకీని మోస్తున్న ఋషులను, త్వరగా నడవమంటూ హింసించసాగేడు. దుర్భల దేహులైన మునులు ఆ బరువును, ఆ హింసను భరించలేక పోయారు. అవమానం, హింస వారికి ఎంతగానో దుఃఖాన్ని కల్గించింది. వారు కోపంతో నహుషుడు నీవు పతితుడవై భూమిపై పడుగాక అని శపిస్తారు. శాపం తక్షణం ఫలించింది. ఇంద్రియాలకు దాసుడై, పరకాంతను కోరిన నేరానికి నహుషుడు పతితుడై పదభ్రష్టుడై దీనంగా హీనంగా జీవిస్తాడు.
సమయ సంతులనాన్ని పాటించక పోవటం వల్ల మానవుడు సోమరిగా మారి ధూర్తుడిగా పరివర్తన చెందుతాడు. మానసిక జడత్వం సోమరితనం ఈ రెండింటిపట్ల అప్రమత్తంగా ఉండి, వీటిబారిని పడకుండా వ్యక్తి తనను తాను కాపాడుకోవటానికి ఏకైక మార్గంగా కాలనియమాన్ని పాటించి తీరాలి.
శారీరకంగా శక్తి ఉండి శరీరశ్రమను ఎగవేసేవారిని మానసిక జడుడు అని నిర్థారించటం జరిగింది. మనకు అతి సమీపంగానే ఉంటూ జీవన సంపదను క్షీణింపచేస్తూ కాలదేవత యొక్క అవహేళనకు గురిచేసే రెండు శత్రువులు ఎవరంటే సోభరితనం – మానసిక జడత్వమే. కాల నియమాన్ని పాటించక పోవటమే ఈ రెండు శత్రువుల ఉద్భవానికి మూలకారణంగా పేర్కొనబడింది.
సమయం యొక్క సదుపయోగం సునిశ్చితమైన శ్రమ నియమపాలన ఈ రెండింటి ద్వారానే సాధ్యమవుతుంది.
సోమరితనం అనేది ఏకైక సంతానం కాదు. దానికి సోదరులు సోదరీమణులు అనేక మంది ఉన్నారు.
ఒకసారి సైతాన్కి సన్యసించాలనిపించింది. తన సమస్త సంపదను అమ్మివేయనారంభించేడు. గుంపులు గుంపులుగా జనం వచ్చి బజారులో సైతాన్ అమ్ముతున్న వస్తువులను కొనసాగేరు. అవిశ్వాసం, ఈర్ష్య, కృతఘ్నత, భోగలాలస, హడావుడి, చాడీలు, రగిలే క్రోథం, విషయాసక్తి తప్పుదారి పట్టించటం ఈ వస్తువులు ప్రజలను బాగా ఆకర్షించేయి. ఎంత ధర అంటే అంతధర చెల్లించి యధేచ్ఛగా కొనసాగేరు. చూస్తూ ఉండగా సైతాన్ వద్ద వస్తువులన్నీ అమ్మి వేయబడ్డాయి.
ఒక్క వస్తువుని మాత్రం సైతాన్ అమ్మకుండా దాచి పెట్టు కొంటాడు. ఎంత ధర చెల్లించినా దీనిని మాత్రం అమ్మననీ, ఒకవేళ సన్యాసంలో తన మనసు లగ్నం కాని పక్షంలో వెనక్కి తిరిగివచ్చి ఈ ఒక్క వస్తువుతో అమ్మినవన్నీ కొనగల విలువైనది ఈ వస్తువనీ తెలియజేస్తాడు. కుతూహలంతో కొందరు ఆ వస్తువు పేరు ఏమిటని ప్రశ్నించగా “సోమరితనం” అంటూ గర్వంగా తెలియజేస్తాడు.
సత్యయుగం భూమి మీదకు రావాలని ప్రయాణమవుతోంది. ఇది చూచి కలియుగం భరించలేక, తన సహచరులందర్నీ పిలిచి సభ ఏర్పాటు చేసింది. వారిలో ఒకరు లేచి నేను భూమిమీదకు వెళ్లి ప్రజలలో ధనం పట్ల మోహాన్ని కలుగజేస్తాను అంటాడు. మరొకరు ప్రజలను కోరికల విషవలయంలో గట్టిగా బంధిస్తాను అంటాడు. మరొకరు కామిని దర్పాన్ని ప్రదర్శిస్తానంటుంది.
ఇవేమీ కలిపురుషుడికి ఆనందాన్నీయవు. ఇంతలో ఒక ముసలి సహచరుడు లేచి నేను వెళ్లి ప్రజలలో సోమరితనాన్ని ప్రేరేపిస్తాను. దీనితో ప్రజలు ఏ మంచిపనీ చేయలేక నీకు దాసులై ఉంటారు అంటాడు. ఈ మాట కలిమహారాజుకి బాగా నచ్చింది. వెంటనే అతడిని తన ప్రధాన మంత్రిగా నియమిస్తాడు. ఆ కలిమహారాజు ప్రజలే నేటి సమాజంలోని సోమరులు. వీరిమధ్య పాపం, సత్యయుగం తన కాలుమోపలేక అల్లాడిపోతుంది. వీరు తొలగినపుడే కదా ఆమె ప్రవేశించగలిగేది.
ఒక వ్యక్తి పనీపాట లేకుండా తిని తిరుగుతూ గ్రామవాసుల చేత “ఆంబోతు” అని పిలువబడేవాడు. ఒకనాడు మార్గమధ్యంలో అతనికి ఒక ఆంబోతు కనిపించింది. దాని వెనుక యజమాని బాబాజీ కూడా ఉన్నాడు. ఈ వ్యక్తి ఆంబోతుని చూచి మిత్రమా! అంటూ ఆదరంగా పలకరించి, మనమధ్య అంతరంలేదు దగ్గరకు రమ్మని ఆహ్వనిస్తాడు. ఆ మాటలకు బాబాజీ వారిస్తూ ఇద్దరు సమానమే కావచ్చు గానీ ఆంబోతు నీకంటే నయం. కనీసం సమయానికి తన తిండి తాను శ్రమించి సంపాదించుకొంటుంది. నీకు అదీలేదు అంటాడు. సోమరులకంటే పశువు నయం అని ఈ కథ వల్ల అర్థమవుతోంది.